
ప్రజాశక్తి - ఆరిలోవ : తోటగరువు ఎర్నిమాంబ ఆలయానికి ఎదురుగా డెయిరీ సమీపంలో నిర్మిస్తున్న అత్యాధునిక రైతుబజార్ ఎప్పుడు పూర్తవుతుందోనని ఆరిలోవ పరిసర ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. 10వ వార్డు పరిధి విమ్స్ వెనుక భాగంలో రైతుబజార్ కోసం సుమారు 46 సెంట్ల భూమి కేటాయించారు. దీనిలో 48 షాపులు, ఒక కార్యాలయం, స్టోర్ గది, ఒక టాయిలెట్ బ్లాక్, ఒక ఆర్ఒ ప్లాంట్తో కూడిన రైతుబజార్ ఏర్పాటుకు గత ఏడాది నవంబరులో శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం కోసం రూ.80 లక్షలు కేటాయించారు. ఇప్పటి వరకు 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన పనులు ఎప్పటికి పూర్తి అవుతాయానని ఆరిలోవ, రవీంద్రనగర్, తోటగరువు, పెదగదిలి, చినగదిలి, హనుమంతువాక పరిసర ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. సుమారు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో రైతుబజార్ అందుబాటులో లేక పోవడంతో అధిక ధరలు వెచ్చించి కూరగాయలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ ప్రాంత ప్రజలు రైతుబజార్కు వెళ్లాలంటే ఎంవిపి కాలనీ, సీతమ్మధార వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడకు వెళ్లాలంటే రెండు, మూడు ఆటోలు మారాలి. ఛార్జీలతో పాటు కాలాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఈ రైతుబజార్ను త్వరిగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.