ప్రజాశక్తి-ఆదోనిరూరల్
రైతు వ్యతిరేక పార్టీ వైసిపి అని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ నీలకంఠప్ప, పట్టణ కార్యనిర్వాహణ అధ్యక్షులు దిలీప్ ఢోకా విమర్శించారు. శనివారం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో వర్షాల్లేక పంట నష్టం జరిగిందని తెలిపారు. పంటలు పండక, పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడకుండా పంట నష్ట పరిహారం కొన్ని మండలాలకే పరిమితం చేస్తూ వివక్ష చూపుతోందని విమర్శించారు. ఆదోని మండలాన్ని కరువుగా ప్రకటించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమని తెలిపారు. వెంటనే రైతులకు పంట నష్ట పరిహారంగా ఎకరాకు రూ.50 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షలు అందించాలని, ఆదోని మండలాన్ని కరువుగా ప్రకటించాలని కోరారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మారుతి రావు, ఆదోని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దేవిశెట్టి వీరేశ్, కాంగ్రెస్ కార్యదర్శి సాయినాథ్, యువ నాయకులు శ్రీనిత్, సుంకన్న, మద్దిలేటి, నిస్సార్ అహ్మద్, మాణిక్యరాజు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు