Feb 13,2023 23:39

ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచిన క్రీడాకారులు

ప్రజాశక్తి-యలమంచిలి రూరల్‌
రాష్ట్రస్థాయి సీనియర్‌ తైక్వాండో పోటీల్లో జిల్లా జట్టు ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ను సాధించినట్లు జిల్లా తైక్వాండో కోచ్‌ నగిరెడ్డి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం కాకినాడ డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అధారిటీ స్టేడియంలో జరిగిన 39వ రాష్ట్రస్థాయి సీనియర్‌ తైక్వాండో ఛాంపియన్‌ షిప్‌తో పాటు ఉమెన్‌ ఛాంపియన్‌ షిప్‌ ప్రథమ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో బాలికల విభాగంలో యు.జయశ్రీ, టి.శ్వేత, లిఖిత బంగారు పతకాలు, బి. భవాని రజత పతకం, ఆర్‌. పల్లవి కాంస్య పతకం సాధించగా, బాలుర విభాగంలో నాగేశ్వరరావు, విజరు కుమార్‌, గురు ప్రసాద్‌ నాయుడు స్వర్ణ పతకాలు, విజరు మోహన్‌ శేషు పతకాలు సాధించి ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ను దక్కించుకున్నారని తెలిపారు. ఈ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన విజేతలు మార్చి 24వ తేదీ నుంచి జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు పేర్కొన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. విజేతలను జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ములంపాక అచ్చం నాయుడు, న్యూ ఆంధ్ర ప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అభినందించారు.