Dec 24,2022 00:05

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-యలమంచిలి
మూడురోజుల పాటు జరుగు రాష్ట్రస్థాయి 6వ అంతర్‌ జిల్లాల బాల బాలికల సబ్‌ జూనియర్‌ వాలీబాల్‌ పోటీలను స్థానిక రాజీవ్‌ క్రీడా మైదానంలో శుక్రవారం ఎమ్మెల్యే యువి.రమణమూర్తి రాజు ప్రారంభించారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి 26 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలన్నా, క్రీడాకారులన్నా తనకు చిన్న తనం నుంచే ప్రత్యేక గౌరవమని ఉందని తెలిపారు. క్రీడాలు దేహదారుఢ్యానికే కాదని, గెలుపోటములను ఎదుర్కొనే మానసిక పరివర్తనకు కూడా దోహదం చేస్తాయని చెప్పారు. డిసిసిబి మాజీ చైర్మన్‌ యు.సుకుమార్‌ వర్మ, ఎంపిపి బోదెపు గోవిందరావు, వైసిపి నాయకులు బొద్దపు ఎర్రయ్యదొర మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది క్రీడాకారులకు ఆతిథ్యం ఇచ్చే బాధ్యత స్వయంగా ఎమ్మెల్యే తీసుకున్నట్టు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఆరెపు గుప్తా, వాలీబాల్‌ జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి ప్రసాదరాజు, పైసా మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.