ప్రజాశక్తి-కొయ్యూరు
రాష్ట్ర స్థాయి అండర్ -19 బాల బాలికల వాలీబాల్ పోటీలు సోమవారం మండలంలోని శరభన్నపాలెం గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. క్రీడా పతాకాన్ని స్థానిక సర్పంచ్ కిముడు సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ భర్త, నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ మాట్లాడుతూ ఎంపీ గొడ్డేటి మాధవి ప్రత్యేక చొరవతో, తమ ఫౌండేషన్ ఆర్థిక సహాయ సహకారాలతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలకు 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఈ పోటీలు జరుగుతాయని, ఈ మూడు రోజులు క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాలకు చెందిన పిఈటిలు, ఫౌండేషన్ డైరెక్టర్స్ దాడి శ్రీనివాసరావు, సురేష్ పట్నాయక్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.










