Mar 04,2023 23:37

విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ప్రవీణ్‌ ప్రకాష్‌

- విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌
- మండలంలో సుడిగాలి పర్యటన
- పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి మారేడుమిల్లి

రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఒకే విధమైన సిలబస్‌ ప్రవేశపెట్టడం జరిగిందని ఎపి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పేర్కొన్నారు. శనివారం మారేడుమిల్లి మండలంలోని ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, కస్తూరిబా బాలికలస్కూలు, పందిరి మామిడికోట మండల పరిషత్‌ పాఠశాలను ఆయన సందర్శించారు. ఏజెన్సీలోని విద్యార్థులకు నష్టం జరగకుండా విద్యాభివృద్ధి చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పాలన్నారు. మండల పరిషత్తు పాఠశాలల్లో ఎంఇఒ తరచూ పర్యవేక్షించాలని సూచించారు. కస్తూరాబా పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నదీ లేనిది ఆరా తీశారు. గతేడాది జూని నుండి ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు లేరని తెలియజేయగా, వెంటనే ఆయన సంబంధిత అధికారితో మాట్లాడి ఉపాధ్యాయుని నియమించాలని ఆదేశించారు. ఆరు నుండి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పందిరి మామిడి కోట పాఠశాలలో యూనిట్లు సరిగా నిర్వహించకపోవడంపైనా, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన గుడ్లు నిల్వ ఉండడంపై ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఇఒ సరిగా పర్యవేక్షణ చేయకపోవడంపై ఆయన్ను ప్రశ్నించారు. ఎంఇఒ ఎప్పటికప్పుడు అన్ని స్కూళ్లను పర్యవేక్షించి తప్పు చేసిన వారిపై జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదికల సమర్పించాలని, డిఇఒ కూడా అన్ని మండలాల్లోని స్కూళ్లను ఎప్పటికప్పుడు పరివేక్షించి సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, ఏపీఓ జనరల్‌ సిహెచ్‌ శ్రీనివాసరావు, రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఐ.శారదా దేవి, జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్‌, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ నరసింహమూర్తి, జిసిడిఓ సూర్య కుమారి, డివిఇఓ ఎన్‌.బెన్న స్వామి, ఎడబ్ల్యుఓ రామ తులసి, ఎంఇఒలు తాతబ్బాయి దొర, మడకం సత్యనారాయణ దొర, ఏపీఇడబ్ల్యుఐడిసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణ. మారేడుమిల్లి ప్రధానోపాధ్యాయులు బిఎస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.