ప్రజాశక్తి -నక్కపల్లి:రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో రాణించి పాయకరావుపేట నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకు రావాలని ఎంఈఓ డివిడి ప్రసాద్ ఆకాంక్షించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఎంపిక నిర్వహించారు. ఎంఈఓ డివిడి ప్రసాద్, హెచ్ఎం రాణి లలిత క్రీడా పోటీలు ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, ప్రతిభా వంతులైన గ్రామీణ క్రీడాకారులకు సిఎం కప్ ఆటలు పోటీలు చక్కని అవకాశమని, మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ పోటీలు ఎంతగానో దోహద పడతాయన్నారు. నియోజకవర్గ క్రీడల ఇంచార్జ్ కుందూరు రాజు మాట్లాడుతూ, కబడ్డీలో 12, వాలీబాల్లో 12, క్రికెట్లో 16 మంది క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కోచ్లు రాంబాబు, రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజు, దేవుళ్ళు, చిరంజీవి, రహమాన్, రవి, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.










