
ప్రజాశక్తి - ఆచంట
రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక, దుర్మార్గ పాలన కొనసాగిస్తోందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆచంటలో టిడిపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 22వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి దుర్మార్గపు ఆలోచనలతో పరిపాలన సాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి నేతలు కట్టా బాలాజీ, పవన్ కుమార్, దొంగ శ్రీనివాస్, బండి సత్యప్రసాద్, కండిబోయిన సత్యనారాయణ, గండి బోయిన శ్రీనివాస్, రమేష్ రాజు, తమన్నా పూడి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
తణుకు : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ ఎంఎల్ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ నాయకత్వంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 22వ రోజు కొనసాగాయి. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్ కార్యకర్తలకు కండువాలు వేసి దీక్షనులను ప్రారంభించారు. జిల్లా ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, టిడిపి పట్టణ అధ్యక్షులు కలవర వెంకటకృష్ణ, ఇరగవరం మండలం అధ్యక్షుడు గోపీశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు.
ఉండి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎంఎల్ఎ మంతెన రామరాజు విమర్శించారు. ఉండిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఎంఎల్ఎ మాట్లాడారు. ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకుని, ఆయనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గేదెల జాన్, గుండాబత్తుల నాగేశ్వరరావు, రియాజుద్దీన్, సిరాజుద్దీన్, బొల్లం వెంకట్రావు, దూబ సురేష్, నౌకట్ల రామారావు పాల్గొన్నారు.
పాలకొల్లు : టిడిపి అంటే బిసిల పార్టీ అని ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు చెప్పారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 22వ రోజు యలమంచిలి మండలం శెట్టి బలిజ సంఘం సభ్యులు దీక్షలో పాల్గొన్నారు. నల్ల బెలూన్లతో ప్రదర్శన చేసి దీక్షల్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పెచ్చెట్టి బాబు, జివి, మామిడి శెట్టి పెద్దిరాజు, కడలి గోపి పాల్గొన్నారు.