అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎ కు సంబంధించిన జిఒ ను వెంటనే విడుదల చేయాలని సిఎంఒ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఎపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగుల డిఎ కు సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తామని సిఎం జగన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. జూలై నుంచి డిఎ కు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ఇంకా విడుదల చేయలేదని చెప్పగా, అప్పటికప్పుడే అధికారులను సిఎం ఆదేశించారని తెలిపారు. హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ కొనసాగింపు జిఒ విడుదలకూ సిఎం సానుకూలంగా స్పందించారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరీక్షలపై ఆందోళన చెందుతున్నారని, పరీక్ష విధానాన్ని, సిలబస్ను సులభతరం చేయాలని సిఎం ను కోరగా.. దీనిపై అధికారులతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పినట్టు వెంకటరామిరెడ్డి వివరించారు.
గురువారం ఎపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఎపి విఆర్ఒ ల సంఘం నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఆయనను సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అరవ పాల్, ఎపి విఆర్ఒ ల సం ఘం అధ్యక్షుడు రవీంద్రరాజు, సంఘ ప్రతినిధులు రాజశేఖర్, లక్ష్మీనారాయణ, అనిల్ పాల్గొన్నారు.