ప్రజాశక్తి-చింతూరు
జిల్లాలోని విఆర్.పురం మండలం రామవరం పంచాయతీ రామవరంపాడు, రామవరం గ్రామాల్లో పొలవరం నిర్వాసితులకు సంబంధించి రీ సర్వే చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఈ గ్రామాలకు చెందిన పొలవరం నిర్వాసితులు చింతూరు ఐటిడిఎ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. బుధవారం నాటి దీక్షలకు గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పులి సంతోష్ కుమార్, విఆర్.పురం జెడ్పిటిసి రంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి రామారావు, టిడిపి నాయకులు బురక కన్నారావు, బొర్రా నరేష్ కుమార్ ఆదివాసీ నాయకులు వెంకటరమణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది నాలుగు సార్లు వచ్చిన వరదలకు రామవరంపాడు, రామవరం గ్రామాల్లో ఇళ్లు మొత్తం మునిగిపోయాయని తెలిపారు. బాధితుల గుర్తింపునకు చేసిన సర్వే అంతా తప్పులు తడకగా ఉందని తెలిపారు. ఇలాంటి తప్పుడు లెక్కలు చూపి నిర్వాసితులకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రహీం, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి, శ్రీరామగిరి ఉపసర్పంచ్ దుర్గారావు, బీరాక సూర్య ప్రకాష్ రావు, బురక సారయ్య, పండ రత్తయ్య, కాక్రోచ్ రంగాచారి, బోధ బోయిన సురేష్, ముత్యాల పోస్ట్బాబు, పెట్టా వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.










