ప్రజాశక్తి - శ్రీకాకుళం లీగల్: రాజ్యాంగాన్ని పరిరక్షించాలని బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎన్ని సూర్యారావు అన్నారు. స్థానిక ఎంపిఆర్ న్యాయ కళాశాలలో ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా మూడో మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా 'భారత రాజ్యాంగం-సవాళ్లు' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో సూర్యారావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఐలు రాష్ట్ర నాయకులు ఎన్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల న్యాయవ్యవస్థకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం న్యాయవాదులు భవిష్యత్లో పెద్దఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందన్నారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఐలు జిల్లా అధ్యక్షులు ఎం.అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో ఎంపిఆర్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ మోషే, ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రమణారావు, నాయకులు ఈశ్వరరావు, లక్ష్మీపతి, శ్రీదేవి పాణిగ్రాహి, వై.చలపతిరావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
'ఐలు' నూతన కమిటీ ఎన్నిక
మహాసభలో ఆలిండియా లాయర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా దుంపల రమణారావు, ప్రధాన కార్యదర్శిగా ఎం.అప్పారావుతో పాటు 25 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.










