Aug 06,2021 13:13

న్యూడిల్లీ : భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డును మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డుగా మారుస్తున్నట్లు ప్రధాన నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. భారత హాకీ జట్టు విజయం నేపథ్యంలో ఈ మార్పు సంతరించుకోవడం గమనార్హం. అవార్డు పేరును మార్చమని చాలా అభ్యర్థనలు వచ్చిన మేరకు ఈ మార్పు చేపట్టినట్లు ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. ' ఖేల్‌ రత్న అవార్డును మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ పేరు పెట్టాలని దేశ వ్యాప్తంగా ప్రజల నుండి విజ్ఞప్తులు వచ్చాయి. వారి అభిప్రాయాలకు కృతజ్ఞతలు, వారి మనోభావాలకు గౌరవించి ఖేల్‌ రత్న అవార్డును ధాన్యచంద్‌ ఖేల్‌ రత్న అవార్డుగా మారుస్తున్నాం' అని ట్వీట్‌ చేశారు. మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ హాకీలో ప్రావీణ్యుడు. ఆయన జట్టు మూడు సార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను సాధించింది.