ప్రజాశక్తి-కోట : బాలింతలు, గర్భవతులు అధిక శక్తినిచ్చే పోషకాలును ఆహారంగా అలవర్చుకోవాలని అంగన్వాడీ టీచర్ కోమది అన్నారు. ఈమేరకు రక్తహీనత, బరువు, పౌష్టికాహార లోపాలను నివారించి 0-6 సంవత్సరం లోపు చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ మండలంలో 15 రోజుల పాటు పోషన్ పఖ్వాడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్బంగా శుక్రవారం కోట మండలంలోని చెందోడు అంగన్వాడీ సెంటర్ వద్ద అంగన్వాడీ టీచర్ కోమది ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. అందులో భాగంగా మండల వ్యాప్తంగా నిర్వహించే పోషన్ పఖ్వాడాపై చిన్నారుల తల్లులకు అవగాహన కల్పించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాలలో చిరుధాన్యాల ప్రదర్శన నిర్వహించి వాటి వినియోగాన్ని వివరించాలన్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్లు వద్ద డైట్ కన్సల్టేషన్ క్యాంపులు నిర్వహించాలన్నారు. గర్భవతులు, బాలింతలుగా ఉన్నప్పుడు ఎక్కువ శక్తినిచ్చే పోషక పదార్ధాలును తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్స్, స్వయం సహాయ సంఘాల సభ్యులతో ప్రతి గృహాన్ని సందర్శించి రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించాలన్నారు. ఏప్రిల్ 3న అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వెల్బేబి షోలను నిర్వహించాలని, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పోషన్ పఖ్వాడా ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కే.సునీత, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.










