న్యూఢిల్లీ : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్లతో సమావేశమయ్యారు. ఢిల్లీలో సోమవారం ఈ సమావేశం జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోనే అత్యంత సీనియర్ సోషలిస్ట్, స్నేహితుడైన ములాయం సింగ్ను కలుసుకున్నానని, ఆయన క్షేమసమాచారాలు తెలుసుకున్నానని లాలూ ట్వీట్ చేశారు. అలాగే దేశంలో కొనసాగుతున్న రైతు ఆందోళనలు, అసమానతలు, పేదరికం, నిరుద్యోగం తదితర సమస్యలపై చర్చించినట్లు ట్విటర్లో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్కు జత చేశారు. కాగా, ఈ సమావేశం అజెండా గురించి ముగ్గురు నేతలు వెల్లడించలేదు. మరికొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు భేటీ కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ ఎన్నికలే ఈ సమావేశం ప్రధాన అజెండా అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పశుదాణా కుంభకోణం కేసులో మూడేళ్ల జైలుశిక్ష అనుభవించిన లాలూ యాదవ్ ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు.