Nov 07,2022 23:52

రోగులకు మందులు పంపిణీ చేస్తున్న ఎంపిపి వాసు రాజు

ప్రజాశక్తి-యంత్రాంగం
భీమునిపట్నం : ఫ్యామిలీ ఫిజీషియన్‌ ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో ఉన్నట్లు ఎంపిపి దంతులూరి వెంకట శివ సూర్యనారాయణరాజు అన్నారు. మండలంలోని టి.నగరపాలెంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమం అమలు తీరును సోమవారం పంచాయతీ సర్పంచ్‌ పొట్నూరు ఛాయా గౌతమి, ఎంపిటిసి సభ్యులు పల్లా నీలిమ, డాకమర్రి ఎంపిటిసి సభ్యులు చెల్లూరి నగేష్‌బాబు, మాజీ ఎంపిటిసి సభ్యులు కోరాడ అప్పలనరసయ్యతో కలిసి పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను కొనియాడారు. పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జునరావు, 104 వైద్యులు శివరామకృష్ణ, ఎఎన్‌ఎం, ఆశా వర్కర్‌, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఎంపిపి ద్వారా రోగులకు మందులు పంపిణీ చేశారు.
వేములవలసలో...
ఆనందపురం : వేములవలస గ్రామపంచాయతీలో సోమవారం ఫ్యామిలీ ఫిజిషన్‌ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ కోరాడ శైలజ వైద్య సేవలందించారు. గ్రామంలో దీర్ఘకాలికంగా బాధపడుతున్న రోగులకు ఇంటి వద్దనే వైద్యం అందించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి శైలజ మాట్లాడుతూ, ప్రతినెలా మొదటి సోమవారం వేములవలసలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సూపర్‌వైజర్‌ ఐ.గోవిందరావు, ఎఎన్‌ఎం ఉమ, అంగన్‌వాడీ కార్యకర్త కామాక్షి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.