ప్రజాశక్తి - నందవరం
మండలంలోని పొనకలదిన్నె గ్రామంలో మహాత్మ జ్యోతి రావు ఫూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు శుక్రవారం భూమిపూజ చేశారు. గ్రామ దళిత సంఘాల కమిటీ నాయకులు ప్రేమర లక్ష్మన్న, పేతూరు ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దగ్గర భూమి పూజ చేశారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కనకవీడు రాజు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి జి.ఆనంద్ చైతన్య మాదిగ, సర్పంచి గొల్ల పావని, ఎంపిటిసి జైపాల్ రెడ్డి, వైసిపి నాయకులు గొల్ల నాగరాజు, రామచంద్రారెడ్డి, గొల్ల వెంకటేష్, గొల్ల మేకల ఈరన్న, నారాయణ హాజరయ్యారు. ముందుగా నాయకులు ఫూలే, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఫూలే, అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పేందుకు గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నియోజకవర్గంలో మొదటిసారి అని తెలిపారు. మహనీయుల స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర వర్గాలు ఐక్యంగా ఉండి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సర్పంచి పావని మాట్లాడుతూ... ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే అన్ని కుల, మతాలకు అతీతంగా ఫూలే, అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని తెలిపారు. గ్రామ దళితులు దావీదు, బతుకన్న, పెద్దయ్య వార్డు మెంబర్ మాల రంగన్న, మాజీ ఎంపిటిసి మాల హనుమంతు, మాల బజారి, ఆంధ్రప్రదేశ్ వృత్తి ఛర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంథోని, కెవిపిఎస్ నాయకులు కలుగొట్ల మాల రాజా రమేష్, గుంటెప్ప, కనకవీడు మాల నాగప్ప, దైవందిన్నె ఎర్రన్న పాల్గొన్నారు.
భూమి పూజ చేస్తున్న సర్పంచి పావని










