Jul 21,2023 01:05
బంగారు పతకం సాధించిన నేహారాంశ్రీని అభినందిస్తున్న కమాండర్‌ కల్నల్‌ సునిల్‌ గౌతమ్‌

ప్రజాశక్తి-చీరాల: 23వ ఆంధ్రా బేటాలియన్‌ ఎన్‌సిసి క్యాడెట్స్‌కు నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ ఉమెన్స్‌ ఫైరింగ్‌ విభాగంలో బంగారు పతకం సాధించిన సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ విద్యార్థిని నేహారామ్‌శ్రీ యాదవ్‌ని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు, ఎన్‌సిసి సిబ్బంది అభినందించారు. చీరాల సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న నేహారామ్‌శ్రీ యాదవ్‌ ఎన్‌సిసిలో శిక్షణ పొందుతూ, ఎన్‌సిసి క్యాడెట్స్‌కు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఫైరింగ్‌ జూనియర్స్‌ విభాగంలో అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించి మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా చీరాల విఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కళాశాలలో ఎన్‌సిసి క్యాడెట్స్‌కు నిర్వహిస్తున్న క్యాంపులో నిర్వహించిన జూనియర్స్‌ ఫైరింగ్‌ విభాగంలో సెయింట్‌ ఆన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ చదువుతున్న నేహారామ్‌శ్రీ యాదవ్‌ ప్రథమ స్థానం సాధించడం తన స్కూలుకి గర్వకారణం అని యాజమాన్యం అన్నారు. చీరాలలో నిర్వహిస్తున్న ఫైరింగ్‌ విభాగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఒంగోలులో శిక్షణనిచ్చి ఢిల్లీలో జరిగే ఆల్‌ ఇండియా ఫైరింగ్‌ పోటీలకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఢిల్లీలో జరిగే అల్‌ ఇండియా ఫైరింగ్‌ పోటీలకు నేహారామ్‌శ్రీ యాదవ్‌ ఎంపికై విద్య అభ్యసిస్తున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మన పట్టణానికి మంచి పేరు ప్రతిష్టలు తీసికొని రావాలని పలువురు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఎన్‌సిసిలో అత్యంత ప్రతిభ కనబర్చి ఫైరింగ్‌ విభాగంలో బంగారు పతకాన్ని సాధించిందని పలువురు శుభాకాంక్షలు తెలిపారు.