ప్రజాశక్తి-ఈపూరు : ప్రత్యేక సారాంశ సవరణ-2024లో భాగంగా మండలంలోని ఎ.ముప్పాళ్లను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముప్పాళ్ల-1 సచివాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఎలక్టోరల్ రోల్స్ పరిశీలనా, మార్పులు, చేర్పులు పునరావృతమైన ఓట్ల తొలగింపు వంటివి క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. గ్రామంలోని బీసీ కాలనీలో ఓటర్లకు సంబంధించిన ఫారం-6, ఫారం-7 దరఖాస్తుల ఇళ్లకు వెళ్లి విచారించారు. గ్రామంలో పర్యటించి స్థానికులతో మాట్లాడి ప్రత్యేక సారాంశం సవరణ-2024 పై వివరాలు సేకరించారు. బూత్ లెవెల్ అధికారులు, ఎఇఆర్ఒలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి వరలక్ష్మి, తహశీల్దార్ సుధాకర్, ఎంపిడిఒ ఎవి రంగనాయకులు పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారమే ఓట్ల తొలగింపు
ప్రజాశక్తి - నకరికల్లు : ఎన్నికల నిబంధనల మేరకు మండలంలో 2553 ఓట్లను తొలగించినట్లు తహశీల్దార్ నగేష్ తెలిపారు. వాటిపై ప్రతిపోలింగ్ బూత్లోనూ విచారణ చేస్తున్నామన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన చీమలమర్రిలో 197 పోలింగ్ బూత్ పరిధిలో 75 ఓట్లు, 198 పరిధిలో 49 ఓట్లు, 199 బూత్ పరిధిలో 83 ఓట్లు తొలగించినట్లు వివరించారు. ఇవన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయన్నారు.










