
ప్రజాశక్తి-నక్కపల్లి:స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. 1991-92 లో పాఠశాలలో చదువుకున్న పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన నక్కపల్లి పాఠశాల వేదిక గా ఆదివారం కలుసుకున్నారు. ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో స్థిరపడిన వారంతా చాలాకాలం తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నారు.ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆనాటి గురువులు శర్మ, నాగలక్ష్మి, పివీఎస్ ఆచార్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రమేష్ బాబు, వెంకట ప్రకాష్ రావు, రవిబాబు, సూర్య ప్రకాష్ రావు, రమేష్, కనక రెడ్డి, సత్యనారాయణ, శంకర్, నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, అనిల్ కుమార్, బాబురావు ,గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.