
ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్ప్లాంట్లో పూర్తిస్థాయి ఉత్పత్తి చేయాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కొత్తగా సిజిఎం (వర్క్స్) బాధ్యతలు చేపట్టిన బికె మొహంతిని ఆయన కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్ మాట్లాడుతూ, ప్లాంట్లో పూర్తిస్థాయి ఉత్పత్తి చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందన్నారు. బిఎఫ్-3ని తక్షణం ప్రారంభించడం ద్వారా పూర్తిస్థాయి ఉత్పత్తితో పాటు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందని వివరించారు. ఆ దిశగా యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరారు.
స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ, ఉత్పత్తిలో కార్మికులు మరింత అంకితభావంతో పనిచేయడం కోసం నూతన వేతనాలను అమలు చేయడంలో యాజమాన్య వైఖరిని మార్చుకోవాలని కోరారు. ఉత్పత్తికి అనుగుణంగా కార్మికులకు ప్రోత్సాహకాలను అందించడం కోసం కృషి జరగాలన్నారు. వీటిని యాజమాన్యం పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు బి.అప్పారావు, శ్రీనివాసరాజు, గంగాధర్, టివికె.రాజు, బిఎన్.మధుసూదన్, సత్యనారాయణ, మురళి, డిఎస్ఆర్సి.మూర్తి, మొహిద్దిన్, దుర్గాప్రసాద్, ముత్యాలనాయుడు, దేముడు నాయుడు, శ్రీనివాసులురెడ్డి, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.