
పుట్టపర్తి రూరల్ : జిల్లాలో పంటల సాగుకు సంబందించిన ఈ-క్రాప్ను క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే వాటి వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ అరుణ్బాబు సూచించారు. పంట సాగుకు సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ అధికారి బయోమెట్రిక్ వేసి దానిని ధ్రువీకరంచాల్సి ఉంటుందన్నారు. మంగళవారం నాడు పుట్టపర్తి మండలంలోని బ్రాహ్మణపల్లి, జీడిపల్లి, జగరాజుపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఈ క్రాప్ నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈక్రాప్ నమోదును ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పొలం విస్తీర్ణం వారీగా పంటల వివరాలను అప్లోడ్ చేసి బయోమెట్రిక్ ధవీకరణ చేయాల్సి ఉంటుందన్నారు. నమోదు చేసిన పంటల వివరాలకు ఈ కేవైసీ, అధికారుల పరిశీలన అనంతరం రైతులకు డిజిటల్ మాన్యువల్ రసీదులను అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, తహశీల్దార్ నవీన్ కుమార్, పాల్గొన్నారు.