
పులి పాదముద్రలు గుర్తింపు
ప్రజాశక్తి - రుద్రవరం
రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని రుద్రవరం అటవీ సెక్షన్లోని హుస్సేనయ్య దర్గా ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించినట్లు రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ హుస్సేనయ్య దుర్గా ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు కొందరు రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారన్నారు. దీంతో రుద్రవరం ఫారెస్ట్ సెక్షన్ అధికారి నాగరాజు, బీటు అధికారులు సురేంద్ర గౌడ్, నరసింహారెడ్డిని ఆ ప్రాంతానికి పంపి పులి పాద ముద్రలను గుర్తించినట్లు చెప్పారు. చలమ అటవీ రేంజ్ ప్రాంతం నుంచి పులి ఈ ప్రాంతానికి వచ్చిందని, తిరిగి అదే ప్రాంతానికి వెళ్లినట్లు పాద ముద్రల ద్వారా తెలిసిందన్నారు. రైతులు పంట పొలాల్లో పనులు చేసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా పులి కనిపిస్తే ఎటువంటి హాని తలపెట్టకుండా సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు.










