Aug 13,2023 21:44

విలేకర్లతో మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు

ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్‌ : రాష్ట్రంలో మళ్లీ వైసిపి అధికారం లోకి వస్తుందని, ఇది తెలిసే పవన్‌, చంద్రబాబు వైసిపిపై విషయం కక్కుతు న్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్థానిక ఆయన నివాసంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తామంటూ సిఎంగా ఉన్నప్పుడు చెప్పిన చంద్రబాబు ఇన్‌సెంటివ్‌ల పేరుతో రూ.257 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పట్టిసీమకు గత ప్రభుత్వం పర్యావరణ అనుమతులు తీసుకోని కారణంగా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రూ.24.90 కోట్లు జరిమానా విధిస్తే దాన్ని తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. వాలంటీర్లను దండుపాళ్యం ముఠాగా పవన్‌కల్యాణ్‌ అభివర్ణించడం ఆయన అవగాహన రాహిత్యమని, అసలైన దండుపాళ్యం బ్యాచ్‌ పవన్‌, లోకేష్‌, చంద్రబాబు అని దుయ్యబట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లకు పవన్‌ పోటీచేస్తారో చెప్పాలన్నారు.