ప్రజాశక్తి -భీమునిపట్నం : పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ మరింత వేగవంతమయ్యేలా దృష్టి పెట్టాలని స్థానిక ఆర్డిఒ ఎస్.భాస్కరరెడ్డి సూచించారు. స్థానిక ఆర్డిఒ కార్యాలయంలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డిఒ మాట్లాడుతూ, 2019లోగా డిగ్రీ, డిప్లమో పూర్తిచేసిన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని వివరించారు. డివిజన్ పరిధిలో ఇప్పటి వరకూ ఆన్లైన్లో 3,750, ఆఫ్ లైన్లో 341 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు వివరించారు. నవంబర్ 7వ తేదీ వరకు ఓటర్ల నమోదు జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వద్దకు విచారణ నిమిత్తం వచ్చే విఆర్ఒ, బిఎల్ఒలకు సహకరించాలని కోరారు. విశాఖ రూరల్ మండలంలో 5, భీమిలిలో 2, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో చెరొక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కె.రామానాయుడు (బిజెపి), ఎం.షణ్ముఖరావు (వైసిపి), గంటా నూకరాజు (టిడిపి), ఆర్ఎస్ఎన్.మూర్తి (సిపిఎం), కె.రాంబాబు (సిపిఐ), భీమిలి, ఆనందపురం, విశాఖ అర్బన్ తహశీల్దార్లు కోరాడ వేణుగోపాల్, ఎల్.రామారావు, పి.శ్యామ్ ప్రసాద్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు శ్రీనివాసరావు, సుధాకర్ పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డిఒ భాస్కరరెడ్డి










