Oct 08,2023 16:59

పతిభ చాటిన విద్యార్థులు

పతిభ చాటిన విద్యార్థులు
ప్రజాశక్తి - తిరుపతి సిటీ
స్మైల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్‌ కార్నివాల్లో తిరుపతి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎంపికైన 59 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు స్టమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం) రంగాలలో తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించారు. మొత్తం 35 ''మార్పు ప్రాజెక్ట్‌లు'' ఇక్కడ ప్రదర్శించబడ్డాయి, వీటిని 2,500 మంది విద్యార్థుల వినూత్న ఆలోచనలు నుండి ఎంపిక చేశారు. ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్‌ జూనియర్‌ ప్రోగ్రామ్‌ అనేది గ్లోబల్‌ ఫ్లాగ్‌షిప్‌ సోషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విద్యా కార్యక్రమం. స్మైల్‌ ఫౌండేషన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, నెల్లూరు, తెలంగాణలోని ఖమ్మం, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాలు, కేరళలోని త్రిసూర్‌ జిల్లాల్లోని 203 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 6, 7 అకడమిక్‌ గ్రేడ్‌లలోని 10 నుండి 12 సంవత్సరాల వయస్సు గల 25వేల మంది పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తోంది. తిరుపతి జిల్లా స్థాయి కార్నివాల్‌ లో , రోజువారీ జీవితంలో పర్యావరణ అనుకూల వినియోగ వనరులతో పాటుగా నీరు, శక్తి, ఆహార పరిరక్షణ, సరైన వినియోగం వంటి అంశాల పట్ల పలు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్‌ అధికారి (తిరుపతి) భాను ప్రసాద్‌ మాట్లాడుతూ ''స్మైల్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్‌ కార్యక్రమం మన పిల్లలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషి స్తుందన్నారు. తిరుపతి మండల విద్యాధికారి మాట్లాడుతూ ''ఈ గ్లోబల్‌ ప్రోగ్రామ్‌ను తిరుపతి పాఠశాలలకు తీసుకువచ్చినందుకు స్మైల్‌ ఫౌండేషన్‌, షెల్‌ను అభినందించారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు.