Oct 20,2023 21:08

నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రసంగించిన సభ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పసుపు నీళ్లతో శుద్ధి చేసి నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక వీవర్స్‌ కాలనీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయం నుంచి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సిఎం సభ స్థలం వరకు బిందెలతో పసుపు నీళ్లు చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మిగనూరులో సిఎం జగన్‌ పర్యటనతో గ్రౌండ్‌ స్థలం అపవిత్రమైందని, అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేశామని తెలిపారు. ఎమ్మిగనూరుకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సిఎం ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడారని చెప్పారు. ఎమ్మిగనూరుకు ఏం అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలకు పరిష్కారం చూపకుండా అవసరం లేని బ్రిడ్జి మంజూరు చేయడం సిగ్గు చేటన్నారు. అనంతరం పట్టణ ఎస్‌ఐ రమేష్‌, పోలీసులతో కలిసి వచ్చి శుద్ధి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల జోక్యంతో జయనాగేశ్వర రెడ్డితో పాటు టిడిపి శ్రేణులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. టిడిపి నాయకులు కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్‌, దయాసాగర్‌, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్‌, మధుబాబు, మల్లికార్జున, బచ్చాల రంగన్న, కలీముల్లా, నజీర్‌ అహ్మద్‌, శిల్పి భాస్కర్‌, బిజ్జె నాగరాజు, కటారి రాజేంద్ర, కృష్ణతేజ నాయుడు, శంకర్‌ గౌడ్‌, ఉప్పర రవి కుమార్‌, అల్తాఫ్‌, దేవేంద్ర, ఎరుకల పరమేష్‌, గోనెగండ్ల చంద్రశేఖర్‌, దేవదాసు, జయన్న, ఈశ్వర్‌, రాజు పాల్గొన్నారు.