
- లోక్సభలో రెండు బిల్లుల ఆమోదం
- లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ను తొలగించాలని కేరళ ఎంపిల ధర్నా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్లో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కీలకమైన బిల్లులను సైతం చర్చలు జరపకుండా, ఓటింగ్ నిర్వహించకుండా నిమిషాల్లో ఆమోదించుకోవడం పార్లమెంటరీ నిబంధనలను తుంగలో తొక్కడమేనని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు కూడా బిల్లులు వెళ్లటం లేదని, విస్తృత చర్చల కోసం సెలక్టు కమిటీ ఊసే లేదని విమర్శించాయి. శుక్రవారం లోక్సభలో అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఏడు నిమిషాల్లోనే బిల్లులు ఆమోదించుకోవడం దారుణమని అన్నారు. చర్చలు లేకుండా బిల్లులు ఆమోదించుకోవడమేంటని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహారిస్తోందని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
పార్లమెంటరీ నిబంధనలను బుల్డోజ్ చేస్తున్నారు : సిపిఎం
సిపిఎం పార్లమెంటరీ పక్షనేత ఎలమరం కరీం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 75 శాతం బిల్లులపై వివిధ కమిటీల్లో చర్చలు జరిగితే, ఇప్పుడు మోడీ హయాంలో ఏడు శాతం బిల్లులే కమిటీలకు వెళ్లాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ నిబంధనలను బుల్డోజ్ చేస్తుందని విమర్శించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించుకున్న ఒక్క బిల్లుపైనా చర్చ జరగలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి బిల్లు ప్రవేశపెట్టడమే తరువాయి, చర్చలు జరపకుండా క్షణాల్లో ఆమోదించుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఉభయ సభల్లో 21 నిమిషాల్లో 25 బిల్లుల ఆమోదం : టిఎంసి
21 నిమిషాల్లో 25 బిల్లులు ఆమోదం పొందాయని టిఎంసి ఆరోపించింది. టిఎంసి ఎంపిలు కకోలి ఘోష్ దస్తిదార్, సుఖేందు శేఖర్ రారు మాట్లాడుతూ ''మనం నిరంకుశ పాలన వైపు వెళ్తున్నామా? రాజ్యాంగ వ్యవస్థను అణగ దొక్కుతున్నారు. ఇది చాలా విచారించదగిన విషయం. విపక్షాలను, ప్రజల విజ్ఞప్తులను ఏమాత్రం ఖాతరు చేయని రీతిలో వ్యవహరిస్తున్నారు. తద్వారా క్రమక్రమంగా మనం ప్రజాస్వామ్యాన్ని కోల్పోతున్నాం. చర్చలేకుండానే బిల్లులు ఆమోదిస్తున్నారు'' అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ వైపు మళ్లుతుండగా, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ జనరల్ స్టోర్గా మారుతోందని విమర్శించారు.
దద్దరిల్లిన పార్లమెంట్..
పెగాసస్, రైతు సమస్యలపై ప్రతిపక్షాల ఆందోళనతో శుక్రవారం ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్సభలో పన్ను చట్టాల సవరణ బిల్లు, సెంట్రల్ వర్శిటీ సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. ప్లకార్డులు పట్టుకుని పెగాసస్, రైతు సమస్యలపై నినాదాలు చేశారు. ఆందోళనల నడుమ, స్పీకర్ ఓం బిర్లా కొద్దిసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఆ తరువాత సభను వాయిదా వేశారు. అనంతర ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ప్రతిపక్ష సభ్యులు వెల్లో ఆందోళన చేస్తుండగానే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగకుండానే ముజువాణి ఓటుతో ఆమోదం పొందింది. వెంటనే ప్యానల్ స్పీకర్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సెంట్రల్ యూనివర్శిటీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కూడా చర్చ జరగకుండా ఆమోదం పొందింది. వెంటనే సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు పెగాసస్, రైతు సమస్యలపై పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో సభ 11 నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో, ప్రశ్నోత్తరాలు కొద్ది సేపు జరిగిన తరువాత సోమవారానికి వాయిదా పడింది.
వివాదాస్పద లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ను తొలగించాలి
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ను తొలగించాలని పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కేరళకు చెందిన సిపిఎం, సిపిఐ, ఎల్జెడి, ఆర్ఎస్పి, ఐయుఎంఎల్ ఎంపిలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమరం కరీం మాట్లాడుతూ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ వివాదాస్పద చర్యలు చేపట్టి అక్కడ జీవవైవిద్యాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్లకు కారు చౌకగా ఐలాండ్లను అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. అడ్మినిస్ట్రేటర్ అమలు చేస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా లక్షద్వీప్ ప్రజలు ఐక్యంగా పోరాడుతున్నారని తెలిపారు. అక్కడి ప్రజల డిమాండ్ను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సోమప్రసాద్, ఎఎం ఆరిఫ్, వి.శివదాసన్, జాన్ బిట్రాస్ (సిపిఎం), బినరు విశ్వం, ఎం.సెల్వరాజ్ (సిపిఐ), ఎన్కె ప్రేమ్చంద్రన్ (ఆర్ఎస్పి), మహ్మద్ బషీర్ (ఐయుఎంఎల్), శ్రేయమ్స్ కుమార్ (ఎల్జెడి) తదితరులు పాల్గొన్నారు.