ప్రజాశక్తి - ఆదోని
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాల్సిన అవశ్యకత ఉందని ఆదోని గ్రీనరీ డెవలెప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, అడ్వకేట్ లలితమ్మ సూచించారు. శుక్రవారం శ్రీమహాయోగి లక్ష్మమ్మవ్వ జాతర సందర్భంగా ఎజిడిఎ, ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా భక్తులకు 300 మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చెట్ల ఆకులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయని తెలిపారు. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ మోతాదు పెరుగుతుందన్నారు. చెట్లు ఎయిర్ ఫిల్టర్లుగా పని చేస్తాయని అందరూ గ్రహించాలని తెలిపారు. చెట్లు చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా విద్యుత్ వంటి ఇంధనాన్ని ఆదా చేస్తాయన్నారు. కాలుష్య ఉద్ఘారాలను బాగా తగ్గిస్తాయని చెప్పారు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వినీత, సెక్రటరీ కె.హరిత, ట్రెజరర్ కోమల, సభ్యులు శ్రీధర్, లక్ష్మీదేవమ్మ, కిరణ్మయి, ఎన్ఎస్ఎస్ డివిజన్ అధికారి జోనాథన్ విక్లీఫ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
మొక్కలు పంపిణీ చేస్తున్న లలితమ్మ










