ప్రజాశక్తి-నెల్లూరు :వాయుకాలుష్యానికి కారణమయ్యే కర్బన ఉద్గారాల వినియోగంపై ప్రజలంతా చైతన్యం పొంది పర్యావరణ సమతుల్యతను కాపాడాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, మంత్రిత్వ శాఖ జాతీయ, రాష్ట్ర, పట్టణ స్థాయిలో ప్రతి ఏటా సెప్టెంబర్ 7వ తేదీన నిర్విహించే నిర్మలమైన ఆకాశం కోసం స్వచ్ఛ వాయువులు లో భాగంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ ర్యాలీ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వి.ఆర్.సి కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించారు.కమిషనర్ మాట్లాడుతూ నగరంలో స్వచ్ఛమైన వాయు పరిస్థితులను పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ వ్యర్ధాలను, పోగుపడిన చెత్తను తగలబెట్టడం మానుకోవాలని, అనవసరంగ ఏ.సి వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై పౌరులంతా బాధ్యతగా మెలిగి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని వారు ఆకాంక్షించారు. ఈ ర్యాలీలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రాజశేఖర్, ఎస్.ఈ సంపత్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, సిటీ ప్లానర్ దేవి కుమారి, ప్రసాద్ సచివాలయం కార్యదర్శులు, నగర పాలక సంస్థ ఇండోర్, ఔట్ డోర్ సిబ్బంది పాల్గొన్నారు.










