Feb 13,2023 23:59

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మల్లికార్జున

ప్రజాశక్తి-విశాఖపట్నం : జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారుచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా టూరిజం కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంస్థలు జిల్లాలో పర్యాటక పరంగా దోహదపడే కార్యక్రమాలను కలెక్టర్‌కు వివరించారు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్‌ బైక్స్‌ యోయో రైడ్స్‌, విహాంగ్‌ ఎడ్వెంచెర్స్‌ వారి పారా మోటార్‌ ఫ్లైయింగ్‌, పారా సైలింగ్‌, నీటిపైన, రోడ్డు, ఇసుక, పర్వతాలపై రైడ్‌ చేయగల ఆల్టేరియన్‌ వెహికల్స్‌ వివరాలను సంబంధిత సంస్థల అధినేతలు వివరించారు. వీటిని పరిశీలించిన కలెక్టర్‌ వాటిని ఎక్కడ ఏర్పాటుచేయాలి, అవి ప్రజలకు, పర్యాటకులకు ఏవిధంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తాయన్న అంశాలపై చర్చించారు. ఆయా సంస్థల ప్రాజెక్టులను పరిశీలించాలని టూరిజం రీజనల్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో రానున్న రోజులలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌, జి-20 సమావేశాల సందర్భంగా దేశ విదేశాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు, టూరిస్టులు అధిక సంఖ్యలో విశాఖకు వస్తారన్నారు. విశాఖ జిల్లాను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడంతోపాటు, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా టూరిజమ్‌ను అబివృద్ధి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్‌ కలెక్టరు కె.ఎస్‌. విశ్వనాధన్‌, డిసిపి సుమిత్‌ సునీల్‌ గర్డ్‌ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్కియాలజి, అటవీ శాఖ, జివిఎంసి, పోలీస్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.