- జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు
శ్రీకాకుళం : జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు బహుళ ప్రచారాన్ని కల్పించి తద్వారా పర్యాటక ప్రదేశాన్ని తీసుకొచ్చేందుకు, పిల్లలు నైపుణ్యం, పరిశుభ్రత, వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు యువ పర్యాటక క్లబ్లు దోహదపడతాయని జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు అన్నారు. నగరంలోని టిపిఎం స్కూల్లో యువక్లబ్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్, పర్యాటకశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ యువ క్లబ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. యువ పర్యాటక క్లబ్ల నుంచి నూతన ఆవిష్కరణలు కోరుతున్నామని అన్నారు. విద్యార్థుల సృజనాత్మక శక్తిని ఉపయోగించి ఈ దిగువ అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ పండగలు, జాతరలు, కళారుపాలపై భావితరాల వారికి తెలియజేయాలంటే యువత వాటిపై డాక్యూమెంట్ తీసి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. యువ క్లబ్ల వల్ల విద్యార్థులకు నైపుణ్యం పెంపొందుతుందన్నారు. డాక్టర్ గీతా శ్రీకాంత్ ముట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవుల్లో వివిధ పర్యటిక ప్రదేశాలను పర్యటించి వీడియోగ్రఫీ చేసి, ఫొటోలు జతచేసి వాటి చరిత్రను తెలసుకొని పలువురికి తెలియజేయాలన్నారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటి చరిత్ర ఫొటోలను జతపరిచి డాక్యూమెంట్ తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో సహాయ పర్యాటక అధికారి డి.రమేష్, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు నీరజ, రోటరీ క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు.










