Aug 20,2023 22:03

సిఆర్‌టిల సమావేశంలో మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు మురళీమోహనరావు

కలెక్టరేట్‌: విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ అహంకార పూరిత వైఖరిని మార్చు కోవాలని యుటిఎఫ్‌ మధ్యంతర కౌన్సిల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. ఈ కౌన్సిల్‌ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన రావు మాట్లాడుతూ 'నేను ఐఎఎస్‌ను..మిమ్మల్ని ఏమైనా చేయగలను' అని ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రవీణ్‌ ప్రకాశ్‌ అన్నారంటే ఆయనకు ముఖ్యమంత్రి జగన్‌ కాపుకాస్తున్నట్లు ఉపాధ్యాయ లోకమంతా అనుకుంటుందన్నారు. ఒకవేళ కాపు కాయక పోతే ప్రవీణ్‌ప్రకాశ్‌ను వెంటనే విద్యాశాఖ కార్యదర్శి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు లక్షా 50వేల మంది ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు కావాలో, ప్రవీణ్‌ ప్రకాశ్‌ కావాలో తెల్చుకోవాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌ మాట్లాడుతూ ఈనెల 23న అమరావతిలో జరిగే 12 గంటల ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు కె.విజరుకుమార్‌, కోశాధికారి మురళి, రాష్ట్ర కౌన్సిలర్లు డి.ప్రకాష్‌, పి.మధు, పిబి రాయుడు, రోజరమణి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
సిఆర్‌టిలను రెగ్యులర్‌ చేయాలి
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయుల అందర్నీ రెగ్యులర్‌ చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహనరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సిఆర్‌టిల సంఘ సమావేశం జరిగింది. ఈసందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్‌టిలను రెగ్యులర్‌ చేయాలని, ఇది వరకు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని కోరారు. సిఆర్‌టిలను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ ఈనెల 25న డిఇఒ కార్యాలయం నుండి కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టర్‌కు వినతిని అందజేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో సిఆర్‌టి నాయకులు. కొమ్ము మురళీకృష్ణ, డప్పుకోట ప్రశాంత కుమార్‌, ఆరిక వెంకటరావు, నాగం దొర హాజరయ్యారు.