Nov 04,2023 17:10

పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌-2024లో భాగంగా శని, ఆదివారాల్లో జరిగే ప్రత్యేక ఓటరు నమోదును విజయవంతం చేయాలని ఆదోని ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ తెలిపారు. శనివారం ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో సిల్వర్‌ జూబ్లీ హాలులో బిఎల్‌ఒలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బూత్‌ లెవల్‌లో ప్రతి బిఎల్‌ఒ ఫారం-6తో ఓటరు నమోదు జనవరి 1, 2024లోపు 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఓటు హక్కు గురించి వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. చనిపోయినా లేదా శాశ్వతంగా వేరే ప్రదేశానికి మారినా వారి ఓట్లు తొలగించడానికి ప్రత్యేక ఫారాలను విడివిడిగా ఇవ్వాలని సూచించారు. ఓటరు కార్డులో పేరు, వయస్సు, జెండర్‌, తప్పులు, అడ్రస్‌ మార్పులు, చేర్పులు ఉన్న వాటిని సంబంధిత పత్రాలను జత చేసి సమర్పించాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, వీరశైవ లింగాయత్‌ కల్యాణ మండపం సమీపంలో ఉన్న పోలింగ్‌ కేంద్రం, హవన్నపేటలోని ఉర్దూ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల, భారతి విద్యాసాధన స్కూల్‌, ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదును పరిశీలించారు. తహశీల్దార్‌ వెంకటలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్‌ రజనీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.