ప్రజాశక్తి- అనకాపల్లి
ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిజనల్ హెడ్ నటరాజన్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 సంవత్సరం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఎస్బిఐ ఆధ్వర్యంలో శుక్రవారం భాష్యం స్కూల్ విద్యార్థులతో కలిసి 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బును సక్రమంగా నిర్వహించుకునే ప్రవర్తన, సురక్షితమైన పొదుపు మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. బ్యాంకుల ఆర్థిక లావాదేవీలు పట్ల ప్రతి ఖాతాదారుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ సాంకేతికతపై నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. మోసపూరిత సందేశాలు, వ్యక్తుల ఫోన్ సంభాషణపై అప్రమత్తత కలిగి ఉండాలన్నారు. నగదు రహిత లావాదేవీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయని, రూపే కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం, క్యూఆర్ కోడ్ ద్వారా నగదురహిత లావాదేవీలు పెరగాలని తెలిపారు.










