Sep 21,2023 19:29

వివరాలు వెల్లడిస్తున్న కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య వివరాలను సేకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి సూచించారు. ఆదోనిలోని ఆర్‌టిసి కాలనీ-2 సచివాలయ పరిధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను కమిషనర్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలూ సేకరించడంతోపాటు వారికి ఉన్న సమస్యలు నమోదు చేసి అక్టోబర్‌ 5న నిర్వహించే వైద్య శిబిరంలో పరీక్షలు చేయించాలన్నారు. ఇందిరా నగర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రవళి యాదవ్‌, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సత్యవతి, ఇందిరా నగర్‌ ఎఎన్‌ఎం, ఆశావర్కర్లు పాల్గొన్నారు.