* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - సరుబుజ్జిలి : రాష్ట్రంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటి కల్పన ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని శాస్త్రులపేటలో సుమారు రూ.45 లక్షలతో, కూనజమ్మన్నపేటలో రూ.43 లక్షలతో, చిన్నషళంత్రిలో రూ.32 లక్షలతో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయిలకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. మర్రిపాడులో రూ.21 లక్షలతో, బురిడివలసలో రూ.38.50 లక్షలతో జల జీవన్ మిషన్ ద్వారా పనులు పూర్తి చేసిన ఇంటింటికీ మంచినీటి కుళాయిలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో భూ అంతర్భాగం నుంచి గానీ సమీప నదుల నుంచి గానీ నీటిని అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కె.బి.జి సత్యనారాయణ, జెడ్పిటిసి ఎస్.నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బద్రి రామారావు, ఎస్సి సెల్ డైరెక్టర్ ఎడ్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










