Sep 06,2023 22:43

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
జిల్లాలో ప్రతి బుధ, శుక్రవారాల్లో నిర్ధేశించిన మండల ప్రధాన కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం (జెకెసి) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేశ్‌ లాఠకర్‌ తెలిపారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ నెల 8న లావేరు, 13న టెక్కలి, 15న పలాస, 20న రణస్థలం, 22న పాతపట్నం, 27న ఇచ్ఛాపురం, 29న ఆమదాల వలస మండల కేంద్రాల్లో జెకెసి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా మండలాల్లో జెకెసిపై అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదులపై తక్షణ పరిష్కారానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాస్థాయి అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారని వివరించారు. ప్రధానంగా కలెక్టర్‌ ఎస్‌పి, జెసి, ఆర్‌డిఒ, జెడ్‌పి సిఇఒ, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్య, ఉద్యానవన, డిఆర్‌డిఎ, గృహ నిర్మాణ, డ్వామా, ఐసిడిఎస్‌ పీడీలు, డిఇఒ డిపిఒ, డిఎస్‌ఒ, వంశధార ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ పర్యవేక్షక ఇంజినీర్లు, సిపిఒ, బిసి సంక్షేమం, జిల్లా సహకార అధికారి, ఎపిడబ్ల్యుఆర్‌ఎస్‌ జిల్లా సమన్వయాధికారి, ఎల్‌డిఎం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, దేవాదాయ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, మండలస్థాయి అధికారులు పాల్గొంటారని వివరించారు.