ప్రజాశక్తి-గుంటూరు : ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష( నీట్) ప్రశాంతంగా జరిగింది. అత్యంత కట్టుదిట్టమెన ఏర్పాట్ల మధ్య పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.20 వరకూ నిర్వహించిన పరీక్షకు విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు. దుస్తులు, ఆభరణాలు, చెప్పులు నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అని పరిశీలించారు. జిల్లాలో ముఖ్యంగా గుంటూరు, నగరం చుట్టుపక్కల 12 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 5069 మందికిగాను 4990 మంది (98.4 శాతం) హాజరయ్యారు. గుంటూరు నగరంలో పలు డాక్టర్ కెఎల్పి పబ్లిక్ స్కూల్, హిందూ ఫార్మసీ, ఆర్విఆర్, కిట్స్, కేంద్రీయ విద్యాలయం తదితర కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.










