
ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. స్థానిక రింగ్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమం పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 14 వరకు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను ముఖ్యమంత్రికే తెలియజేసుకునే అవకాశం ఉందని చెప్పారు. పార్టీ నినాదంతో ముద్రించిన స్టిక్కరును గృహ యజమాని అనుమతితో అతికిస్తామని చెప్పారు.
దేశ నాయకులకు నివాళులర్పిస్తున్నప్పుడు
నినాదాలు సబువైనా?
బాబు జగ్జీవన్ రామ్కు బుధవారం తాను నివాళులర్పిస్తున్న సమయంలో డివిఎన్ కళాశాల విద్యార్థులు నినాదాలు చేయడం సబువైనా అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇటువంటి చర్యలను ఏ పార్టీ నాయకులు సహించరన్నారు. పోలీసులు కళాశాలలోకి వెళ్లి విషయం తెలుసుకున్నారు తప్ప ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కొంతమంది నాయకులు దీని రాజకీయం చేయడం సరికాదన్నారు. తాను దాడి వీరభద్రరావు కుటుంబంలో సభ్యుడనేనని, డివిఎన్ కాలేజీ తన సొంత కళాశాల వంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, మల్ల బుల్లిబాబు, పలక రవి, జెడ్పి వైస్ చైర్పర్సన్ బివి సత్యవతి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కార్పొరేటరు జాజుల ప్రసన్న లక్ష్మి, వైసిపి నాయకులు కొణతాల మురళీకృష్ణ, జాజుల రమేష్, కెఎం.నాయుడు, దాడి నారాయణరావు పాల్గొన్నారు.