ప్రజాశక్తి-ఆదోనిరూరల్
ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వైద్యులకు సూచించారు. మంగళవారం పట్టణంలోని ప్రసూతి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్పిటల్లోని రిసెప్షన్లో రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. విధులకు పూర్తిస్థాయి సిబ్బంది హాజరయ్యారా అని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా గర్భిణులకు ప్రతినెలా జరిగే స్కానింగ్ కార్యక్రమంలో ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తాగునీరు, కుర్చీలు, ఫ్యాన్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిర్మాణంలో ఉన్న హాస్పిటల్ అదనపు గదుల పనుల పురోగతిపై పరిశీలించారు. నిర్ణీత గడవులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకు రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి లత, ఎపిఎంఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివరాం రెడ్డి, ఆదోని తహశీల్దార్ వెంకట లక్ష్మీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్










