Oct 25,2023 21:47

ప్రజల వద్దకే వైద్యం: ఆర్‌కె రోజా
ప్రజాశక్తి- వికోట: రాష్ట్రంలోని ప్రజలందరికి సంపూర్ణ ఆరోగ్యం కల్పించాలన్న లక్ష్యంతో చేపట్టినదే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమని చిత్తూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు. మండల పరిధిలోని చింతమాకులపల్లిలో బుధవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆరోగ్య శిబిరంలోని స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం చైర్మన్‌ వైద్యపరీక్షలు చేయించుకుని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రజల వద్దకే వైద్యబందాన్ని పంపించి నిర్వహిస్తుందని, శిబిరాలను సద్వినియోగం చేసుకొని వైద్య ఖర్చులను తగ్గించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలని ప్రజలకు సూచించారు. క్షేత్రస్థాయిలోని వైద్య సిబ్బంది ఈ వైద్య శిబిరం లక్ష్యాలను ప్రజలకు తెలియజేసి అధికసంఖ్యలో ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా కషి చేయాలన్నారు. ఎంపీపీ యువరాజ్‌, ముదరందొడ్డి సింగిల్‌ విండో అధ్యక్షులు గోపిరెడ్డి, ఎంపీడీవో మహమ్మద్‌ రఫీ పాల్గొన్నారు.
విజయపురం: స్థానిక మండలంలోని శ్రీహరిపురంలో బుధవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యం చేసుకున్న వారికి మెడికల్‌ కిట్టు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ వైద్య శిబిరాన్ని సందర్శించి మందులు సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం జగనన్న హౌసింగ్‌ లేఔట్‌ను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి హౌసింగ్‌ ప్లాట్‌ అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్వో రవిరాజు, ఎంపీడీవో చంద్రమౌళి, తహశీల్దార్‌ వెంకటరాయలు, సిడిపిఓ కష్ణవేణి, మండలాధ్యక్షులు గోపి పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్‌: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నాణ్యమైన వైద్యసేవలు ప్రజల ఇంటి వద్దనే అందుతున్నాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 5వ వార్డు సచివాలయం వద్ద నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని బుధవారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్‌ ఎస్‌ అముద పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని ఇవన్నీ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించగా, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మెరుగైన వైద్యసేవలను అందిస్తోందన్నారు. అనంతరం జగనన్న మెడికల్‌ కిట్లను పంపిణీ చేసి ఐసిడిఎస్‌, డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లను సందర్శించారు. స్థానిక కార్పొరేటర్‌ సి.హరిణీ రెడ్డి, సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, సీఎంఎం గోపి పాల్గొన్నారు.
నగరి: ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించేందుకే జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్‌ పరిధి ఏకాంబరకుప్పంలో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్యసురక్ష శిబిరాన్ని ఆయన పర్యవేక్షించారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బాలన్‌ మాట్లాడుతూ వైద్య రంగంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విప్లవాత్మక మార్పులు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీసుకువచ్చారన్నారు. వేల కోట్లు ఖర్చు చేస్తూ పేదలకు వైద్యాన్ని చేరువ చేస్తున్నారన్నారు. మున్సిపల్‌ మేనేజర్‌ శేఖర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చౌడేపల్లి: మండలంలోని పెద్ద కొండామర్రిలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సర్పంచ్‌ జయసుధమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాజుల రామ్మూర్తి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదలకు వరం లాంటిదని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు కంటి వ్యాధిగ్రస్తులకు కళ్ళజోలను పంపిణీ చేశారు. ఎంపీడీవో సుధాకర్‌, వైసిపి సీనియర్‌ నాయకుడు నాగభూషణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు
బంగారుపాళ్యం: జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు ఒక వరం వంటిదని ఎంపీపీ అమరావతి అన్నారు. బుధవారం మండలంలోని సెట్టరి సచివాలయంలో జగనన్న ఆరోగ్యశ్రీ శాఖ పంచాయతీ కార్యదర్శి ఎల్లప్ప ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. అనంతరం కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేసుకున్న వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేపట్టారు. వైస్‌ ఎంపీపీ శిరీష్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ అన్నా మల్‌ రెడ్డి, ఇన్చార్జ్‌ ఎంపీడీవో హరిప్రసాద్‌ రెడ్డి, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, మార్కొండయ్య వైద్యులు లోహిత్‌ చంగల్‌ రాయులు, తదితరులు పాల్గొన్నారు.
గంగాధర నెల్లూరు: జగనన్న సురక్ష పథకం పేదలకు వరం లాంటిదని గంగాధర నెల్లూరు మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఏకాంబరం అన్నారు. బుధవారం మండల పరిధిలోని పెద్దకాల్వ పంచాయతీ ఎన్టీఆర్‌ కాలనీలోని స్కూల్‌ వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు షర్మిల, దుర్గ, ప్రశాంత్‌, సీహెచ్‌వో శ్రీనివాసులు, ఫార్మసిస్ట్‌ నాగలక్ష్మి , ఎంఎల్‌ హెచ్‌పీ దీప్తి, ఎఎన్‌ఎం సుజాత పాల్గొన్నారు.