ప్రజాశక్తి-ఆలూరు
ప్రజల కళ్లుగప్పి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు వసూలు చేస్తోందని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జీ కోట్ల సుజాతమ్మ విమర్శించారు. శనివారం టిడిపి కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 నుంచి 2019వ సంవత్సరంలో వాడిన విద్యుత్ చార్జీల బిల్లు కట్టినా వైసిపి ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల పేరుతో అదనంగా చార్జీలు వేసి రాష్ట్రాల్లో ప్రజలపై రూ.వేల కోట్లు వసూలు చేస్తోందని మండిపడ్డారు. విద్యుత్ కోతలు విధిస్తూ, తాగేందుకు నీరు లేక ప్రజలు ఉక్కపోతతో ఉన్నా విద్యుత్ చార్జీలు మాత్రం గతం కంటే ఎక్కువ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతుల బోర్లకు మీటర్లు బిగించి రైతు వెన్నెముకను విరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని విమర్శించారు. విద్యుత్ అధికారులు వచ్చి రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే పగులగొట్టాలని ఆమె రైతులను కోరారు. ప్రభుత్వంపై నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని తెలిపారు. నారాయణ రెడ్డి, నర్సప్ప, నారాయణ, న్యాయవాది వలీ, చంద్రశేఖర్, మసాలా జగన్, సూరి, గూళ్యం రామాంజనేయులు పాల్గొన్నారు.
ప్రజాశక్తిలో వచ్చిన విద్యుత్ పేరిట నిలువు దోపిడి శీర్షికను చూపుతున్న కోట్ల సుజాతమ్మ










