ప్రజాశక్తి-అనకాపల్లి
వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. స్థానిక రింగ్ రోడ్డులోని టిడిపి కార్యాలయంలో మంగళవారం టిడిపి మండల అధ్యక్షులు, క్లస్టర్ కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లకు వర్షాప్ నిర్వహించారు. రాబిన్ శర్మ, కిరణ్ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ పప్పల చలపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇదేం కర్మ.., ఇదేమి ప్రభుత్వం అని భావిస్తున్నారని తెలిపారు. వైసిపి సమావేశాలకు డ్వాక్రా మహిళలను, పింఛన్దారులను బలవంతంగా తరలిస్తున్నారని, వెళ్లకుంటే పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి లాలం కాశి నాయుడు, ధనాల విష్ణు చౌదరి, కొణతాల రత్న కుమారి, కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి నీలబాబు, మళ్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.










