Oct 14,2023 20:46

సమావేశంలో మాట్లాడుతున్న నరహరి

మదనపల్లె అర్బన్‌ : ప్రజాస్వామ్య విలువలను ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి కాలరాస్తున్నారని మాజీ మంత్రి ఎన్‌.అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం అంగళ్లు ఘటనలో తమపై నమోదైన తప్పుడు కేసులకు బెయిల్‌ మంజూరు కావడంతో రాజంపేట ఎంపీ అభ్యర్థి గంట నరహరి, మదనపల్లి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొమ్మలపాటి రమేష్‌తో కలిసి డిఎస్‌పి కార్యాలయానికి వెళ్లారు. అనంతరం బైపాస్‌ రోడ్డులోని టికెఎన్‌ ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్‌.అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్క అవకాశం పేరుతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్షపూరిత ధోరణి వ్యవహరిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్‌ డెవలప్మెంటులో అక్రమాలు జరిగాయని తప్పుడు కేసులు బనాయించి 35 రోజులు పాటు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికే రక్షణ లేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. శాంతిభద్రతలు రాష్ట్రంలో పూర్తిగా కొరవడ్డాయనడానికి ఇవే సాక్ష్యాలన్నారు. అనంతరం గంటా నరహరి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు విషయంలో తమకు సంబంధం లేదని కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దగ్గర నారా లోకేష్‌కు తెలియజేశారన్నారు. కార్యక్రమంలో టిడిపి స్టేట్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, యువ నాయకులు దొమ్మలపాటి యశస్వి రాజ్‌, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి ఎస్‌.ఎం.పర్వీన్‌తాజ్‌, టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్‌.జె.వెంకటేష్‌, ఎస్‌.ఎం.రఫీ, ఎస్‌.ఎ.మస్తాన్‌, దేవరింటి శ్రీనివాసులు, తులసీదర్‌ నాయుడు, దొరస్వామి నాయుడు పాల్గొన్నారు.