ప్రజాశక్తి - మంగళగిరి : రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటానికి యువకులు ముందుకు రావాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కెవిఎస్ సాయిప్రసాద్ అన్నారు. ప్రజా ఆరోగ్య వేదిక మంగళగిరి శాఖ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పిల్లల ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని సాయిప్రసాద్, డాక్టర్ అంబికా, నిర్మల జూనియర్ కాలేజీ డైరెక్టర్ వివి ప్రసాద్ ప్రారంభించారు. సాయి ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో రక్తదానం చేసేవారి కొరత ఉందని, అందువలన 17-65 ఏళ్లవారు ఆరోగ్యంగా ఉంటే రక్తం దానం చేయవచ్చునని అన్నారు. ఒకరు రక్తం దానం చేస్తే ముగ్గురు ప్రాణాలను కాపాడవచ్చునని చెప్పారు. రక్తదాన శిబిరంలో 30 మంది దాకా రక్తం దానం చేశారు. డివైఎఫ్ఐ నాయకులు ఎం.నాగేశ్వరావు 30వసారి రక్తం దానం చేశారు. కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక మంగళగిరి శాఖ కార్యదర్శి ఎ.జయరాజు, విజె జూనియర్ కళాశాల డైరెక్టర్ పి.రాజశేఖర్, ప్రజాసంఘాల నాయకులు జెవి రాఘవులు, ఎం.రవి, ఎం.భాగ్యరాజు, ప్రజా ఆరోగ్య వేదిక నాయకులు పి.రామ్మోహన్రావు, కె.సుందరయ్య, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఆసిఫ్అలీ పాల్గొన్నారు.










