Aug 28,2023 20:12

నందవరంలో నివాళులర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - నందవరం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకంగా తిప్పికొట్టాలని, పోరాటాలు చేస్తూ మరణించిన అమరవీరులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు సి.గురుశేఖర్‌ తెలిపారు. సోమవారం సిపిఎం నాయకులు ఎల్లేష్‌ అధ్యక్షతన విద్యుత్‌ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను తిప్పికొట్టాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ చార్జీలను విపరీతంగా పెంచుతూ రైతులు, ప్రజలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విద్యుత్‌ చట్టాలు తీసుకొస్తున్నాయని తెలిపారు. ఒక యూనిట్‌కు 45 పైసల చొప్పున విద్యుత్‌ చార్జీలు పెంచుతున్నాయని చెప్పారు. మొబైల్‌కు రీచార్జీ ఎలా చేయించుకుంటామో అలా విద్యుత్‌ మీటర్లకు బిగిస్తూ నెలకు విద్యుత్‌ రీచార్జీ చేసుకునే విధంగా ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయని తెలిపారు. పెరిగిన ధరలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సెప్టెంబర్‌ 1న సచివాలయాల ముందు జరిగే ధర్నాలు, 4న ఎంపిడిఒ కార్యాలయం ముందు జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం నాయకులు రవి, సంతోష్‌, నగేష్‌, కొండన్న, స్వామిదాసు పాల్గొన్నారు. ఆస్పరిలోని సుందరయ్య భవనంలో అమరవీరుల చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు హనుమంతు, సిపిఎం నాయకులు రామాంజనేయలు, రంగస్వామి, రామాంజినేయులు, మధు రెడ్డి, షేక్షావలీ పాల్గొన్నారు. దేవనకొండలోని సిఐటియు కార్యాలయంలో శ్రీనివాసులు అధ్యక్షతన సంస్మరణసభ నిర్వహించారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు అశోక్‌, సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు ఎం.రంగన్న, వై.రంగన్న, బండ్లయ్య, మహేంద్ర, బలరాముడు, రామాంజిని, కుమార్‌, మహేష్‌, కాంతయ్య, రాజు, రాముడు పాల్గొన్నారు.

ఆస్పరిలో నివాళులర్పిస్తున్న నాయకులు
ఆస్పరిలో నివాళులర్పిస్తున్న నాయకులు