Sep 08,2023 20:20

వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌

ప్రజా వినతులకు తక్షణ పరిష్కారం చూపండి
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
- గోస్పాడు మండలంలో వినతుల వెల్లువ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     ప్రజా వినతులకు తక్షణ పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కరించే చిన్న చిన్న సమస్యలు సైతం కలెక్టరేట్‌కు వస్తున్న నేపథ్యంలో మండల స్థాయిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వ సూచన మేరకు శుక్రవారం గోస్పాడు మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టి. రాహుల్‌ కుమార్‌ రెడ్డి, డిఆర్‌ఒ పుల్లయ్య ఇతర జిల్లా అధికారులు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ స్పందన కార్యక్రమం ద్వారా మండల స్థాయిలో పరిష్కరించే ప్రజా ఫిర్యాదులకు మరింత మెరుగైన సర్వీసులు అందించాలని అధికారులకు సూచించారు. సాధ్యమైనంతవరకు స్వీకరించిన దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించి అర్జీదారుల్లో సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. మంచినీటి వసతి కల్పించాలని, కాలువలలో పూడిక తీయడం లేదని, పారిశుధ్య చర్యలు చేపట్టాలని తదితర సమస్యలను మండల స్థాయి అధికారులే పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులు కలెక్టరేట్‌కు వచ్చే వ్యయప్రయాసలు తగ్గించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో స్పందన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువులో మెరుగైన సర్వీసులందించేందుకు కృషి చేయాలని సూచించిందన్నారు. స్పందన కార్యక్రమంలో 29 మంది తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్‌ ఎస్‌ఎల్‌ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, మండల అధ్యక్షులు సైమాన్‌, ఎంపిడిఒ భాస్కర్‌, తహశీల్దార్‌ విజయ శేఖర్‌, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.