Jun 11,2023 01:37
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ

ప్రజాశక్తి-రేపల్లె: ప్రజా సంక్షేమమే జగనన్న ధ్యేయమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. శనివారం పట్టణంలోని 13వ వార్డులో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడపలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగడంలేదని, సీఎం జగన్‌ ఆలోచన ద్వారా రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమం చేరాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని అన్నారు. ప్రతి గడప క్షేమంగా, ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కోరారు. మరోపక్క ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎక్కడికక్కడే అధికారులను ఆదేశిస్తున్నారు. పేదల స్థితిగతులు మార్చేందుకు వివిధ పథకాల ద్వారా కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా జమ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కట్టామంగా సుబ్బారావు, మోపిదేవి రాజీవ్‌, బుడా చైర్మన్‌ దేవినేని మల్లికార్జునరావు, పట్టణ కన్వీనర్‌ గడ్డం రాధాకృష్ణమూర్తి, వైస్‌ చైర్మన్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.