Oct 27,2023 00:08

వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం విఆర్‌.పురం మండల నాయకులు

ప్రజాశక్తి-చింతూరు
లౌకికవాదం ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఐక్యం చేసేందుకు సిపిఎం ఈ నెల 30న సీతంపేటలో ప్రారంభించనున్న మన్యం ప్రాంత ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌, జిల్లా నాయకులు పల్లపు వెంకట్‌ పిలుపునిచ్చారు. మండలంలోని తులసిపాక సచివాలయం పరిధి లక్కవరం గ్రామంలో జరిగిన సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఎం బస్సు యాత్ర వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి ఉన్న ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందన్నారు. మతోన్మాద ఏజెండాతో ప్రజల మధ్య విద్వేశాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. రాష్ట్ర విభజన హామీలను తుంగలో తొక్కి, రాష్ట్ర ప్రజలను బిజెపి మోసగించిందని విమర్శించారు. బీజేపీకి వైసిపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు కొమ్ముకాస్తూ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని పేర్కొన్నారు. బస్సు యాత్ర నవంబర్‌ 5న చింతూరు చేరుకుంటుందని, ఆ రోజు నిర్వహించే బహిరంగ సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మడకం చిన్నయ్య, కలుముల మల్లేష్‌, సత్తిబాబు, లలిత, సోమిరెడ్డి, కన్నపు రెడ్డి, నితిన్‌ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం బస్సు యాత్ర పోస్టర్‌ ఆవిష్కరణ
విఆర్‌.పురం : ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను మండల కేంద్రంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో గురువారం ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ నవంబర్‌ 4, 5 తేదీల్లో ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లాలో ఏజెన్సీ ప్రాంత బస్సు యాత్ర జరుగుతుందని, ఈ యాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వం వహిస్తారని తెలిపారు. 5వ తేదీన రేఖపల్లి వద్ద బహిరంగ సభ జరుగుతుందని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్మార్ట్‌ మీటర్లు బిగింపు ఆపాలని, ట్రూ అప్‌ ఛార్జీలు, పెంచిన విద్యుత్‌ ఛార్జీలు రద్దు చేయాలని, రూ.400కే గ్యాస్‌, రూ.60కే లీటర్‌ పెట్రోలు, డీజిల్‌, ఉచితంగా ఇసుక ఇవ్వాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, నాయకులు సోడి మల్లయ్య, సిరపు తాతబాబు, హజరత్‌, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.