Oct 29,2023 00:28

ప్రచారం చేపడుతున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి -ముంచింగిపుట్టు: ప్రజారక్షణ భేరి మన్యం బస్సు యాత్రను జయప్రదం చేయాలని శనివారం మండల కేంద్రంలో వారపుసంతలో సిపిఎం నేతలు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందు నవంబర్‌ 2వ తేదీన సీపీఎం రాష్ట కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, మన్యం జిల్లాలో బస్‌ యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతాలను బడా కార్పొరేట్లకు కట్ట బెట్టి అటవీ ప్రాంతం నుండి గెంటి వేయాలని ప్రణాళికాలు రచిస్తున్నాయన్నారు.న్యాయ వ్యవస్థ లో ఉన్న క్రిమినల్‌, అట్రాసిటీ, గిరిజన చట్టాలను సవరించడానికి పార్లమెంట్లో నూతన బిల్లులు కేంద్రం తీసుకొచ్చిందన్నారు. జీఓ 3 రద్దు చేసి ఆదివాసీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా ప్రభుత్వాలు చేశాయన్నారు. అల్లూరి జిల్లాలో కాపీ రైతులకు 2017-2022 వరకు ఐటీడీఏ కాపీ రైతుల బకాయిలు చెల్లించలేదన్నారు. ఈ విషయంపై అనేకమార్లు ఐటీడీఏ ముట్టడి చేసినప్పటికీ కనీస చలనం లేకుండా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. గిరిజన ప్రాంతంలో నెలకొన్న అనేక సమస్యలను వెలికి తీసేందుకు ప్రజా రక్షణభేరి బస్సు యాత్ర చేపడుతున్నామని, ఆదివాసి గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల వైస్‌ ఎంపీపీ పాటుబోయి సత్యనారాయణ, జర్రెల ఉపసర్పంచ్‌ వంతల గణపతి, సిపిఎం మండల కమిటీ సభ్యుడు ఎంఎం శ్రీను, గల్లెల నారాయణ, నరసయ్య, డోంమ్రు పాల్గొన్నారు.